యాదాద్రి, ఏప్రిల్ 29: యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఓ భవనం రెయిలింగ్ కూలి మీదపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక కెనరా బ్యాంకు ఏటీఎం పక్కన గుండ్లపల్లి దశరథగౌడ్కు రెండంతస్తుల భవనం ఉన్నది. కింద షటర్లో సుంచు శ్రీనివాస్ (40) వస్త్ర దుకాణం నడుపుతున్నారు.
అతడి స్నేహితులు ఉపేందర్ (40), శ్రీనాథ్ (40) శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ దుకాణం వద్దకు వచ్చారు. అక్కడే పక్కనే బ్యాటరీల దుకాణం నడిపే గిరి, భవన యజమాని దశరథగౌడ్ (70) కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మొదటి అంతస్తు రెయిలింగ్ కూలి కింద షెటర్ ముందు ఉన్న రేకులపై షెడ్డుపై పడింది. దీంతో షెడ్డు కింద ఉన్న నలుగురూ శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. బ్యాటరీల దుకాణం నిర్వాహకుడు గిరి తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్పించారు. మృతదేహాలను భువనగిరి దవాఖానకు తరలించారు. భవనం 30 ఏండ్ల కింద నిర్మించినట్టు స్థానికులు తెలిపారు.