చండ్రుగొండ, జనవరి 28: రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో వరి నారు తీసే పని కోసం భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలంలోని దళితకాలనీకి చెందిన పదిమంది శుక్రవారం ఉదయం ట్రాలీ ఆటోలో బయల్దేరారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న కత్తి స్వాతి (26), వెక్కిరాల సుజాత (46) దుర్మరణం చెందగా గుర్రం లక్ష్మి (52), సాయమ్మ (40) కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలో ప్రాణాలు వదిలారు. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు మృతదేహాలు, మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు రాస్తారోకోకు దిగడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆందోళనకారులను శాంతింపజేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జూలూరుపాడు సీఐ నాగరాజు తెలిపారు.