కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల (Kotilingala) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన అరవింద్, వరంగల్కు చెందిన రాము, కల్యాణ్, శివగా, గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre wedding shoot) కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తున్నది.