కోహీర్, జూలై10: గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా (Kohir Municipality) ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27వ తేదీన మున్సిపాలిటీగా ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదు. జనవరి 28న ఉమామహేశ్వర్రావు కోహీర్ పట్టణ తొలి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన ఫిబ్రవరి 16వ తేదీ వరకు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో మున్సిపల్ అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త మున్సిపాలిటీ అయిన ఐదు నెలల్లో నలుగురు కమిషనర్లు ఇక్కడకు వచ్చి చేసేదేమీలేక తిరిగి వెళ్లారు. ఉమామహేశ్వర్రావు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు కోహీర్ కమిషనర్గా విధులు నిర్వహించారు. తర్వాత వెంకట్రెడ్డి మార్చి 18వ తేదీ వరకు కార్యాలయ విధులకు హాజరయ్యారు. ఆయన బదిలీ కావడంతో మున్సిపల్ కమిషనర్గా రమేశ్కుమార్ బాధ్యతలను చేపట్టారు. కానీ అతడు కూడా మార్చి 4వ తేదీ వరకు మాత్రమే ఇక్కడ పని చేశారు. అతడు తాండూర్ వెళ్లిపోవడంతో కొత్త కమిషనర్గా ప్రకాశ్ విధుల్లో చేరారు. అతడిని కూడా సీడీఎంఏ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ వచ్చే వరకు కోహీర్లోనే విధులు నిర్వహించాలని మౌకికంగా సూచించారు. కానీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఆయన మాత్రం జూన్4వ తేదీన దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నెల గడిచినా కొత్త కమిషనర్ను నియమించలేదు. దీంతో పట్టణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు నీరు, రోడ్ల పక్కన చెత్త కనిపిస్తున్నది.
కోహీర్ పట్టణ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించిన ప్రకాశ్ గత నెల 4వ తేదీన హైదరాబాద్ కార్యాలయానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్క ఆన్లైన్ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త కమిషనర్ వస్తేనే అతడి కీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రారంభమవుతుంది. అంత వరకు జనన, మరణ, భవన అనుమతులు, మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్సు, లే ఆవుట్స్, అసెస్మెంట్లు కొనసాగుతాయి. కానీ పట్టణ ప్రజలు పత్రాల కోసం నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిస్సాహయ స్థితిలో ఉన్నారు. వారు కేవలం పారిశుధ్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పనులను చేపడుతున్నారు. ఆన్లైన్ సేవలను మాత్రం ప్రారంభించడం లేదు. ఇలాంటి పరిపాలన మరెక్కడా ఉండదని పట్టణ ప్రజలు రుసరుసలాడుకుంటున్నారు.
నా దుకాణం, ఇంటి నంబర్ను ఆన్లైన్ చేయాలని నెల రోజుల నుంచి ఇక్కడకు వస్తున్నాను కోహీర్ పట్టణానికి చెందిన రాంచందర్ చెప్పారు.. మా పిల్లల భర్త్ సర్టిపికేట్ అవసరం ఉంది. ఎన్ని సార్లు వచ్చినా కమిషనర్ లేడు అని చెప్తున్నారు. ఇలా ఎన్ని రోజులు తిరుగాలి. మా పని ఎప్పుడు అవుతుందో అర్థం కావడం లేదు.
కోహీర్ను మున్సిపాలిటీగా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని కోహీర్ మాజీ ఎంపీటీసీ అనితాసంపత్కుమార్ అన్నారు. ఉపాధిహామీ కూలీలకు పని నిలిచిపోయింది. ఆన్లైన్ సేవలు అందడం లేదు. ఇంటి నంబర్లు ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి. వాటిని సరి చేయాలంటే కచ్చితంగా కమిషనర్ ద్వారానే అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి.