అక్కన్నపేట, మే 24: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరుసకు అన్నదమ్ములైన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరకల కృష్ణ(38), సంజయ్(36), సురేశ్(36), వాసు(35)గా గుర్తించారు. ప్రమాదం నుంచి సురేశ్ కుమారుడు భార్గవ్రామ్ ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం..చౌటపల్లికి చెందిన ఎరుకల రాజయ్య, కనకయ్య, రాములు, లింగమూర్తి అన్నదమ్ములు.
రాజయ్య కుమారులు కృష్ణ, సంజయ్, రాములు కుమారులు సురేశ్, వాసు సూరత్లో ప్లంబింగ్, ఇతర కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం ఎరుకల కనుకయ్య అనారోగ్యంతో చనిపోయాడు. విషయం తెలిసిన రాములు.. భార్య, కుమారులు సురేశ్, వాసు, మనవడు అభిరామ్తోపాటు పాటు అన్న కుమారులైన సంజయ్, కృష్ణతో కలిసి గ్రామానికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మంగళవారం ఐదో రోజు కాగానే కృష్ణ, సంజయ్, వాసు, సురేశ్, అభిరామ్ కలిసి కారులో సూరత్ బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కృష్ణ, సంజయ్, సురేశ్, వాసు అక్కడికక్కడే చనిపోగా బాలుడు అభిరామ్ గాయాలతో బయటపడ్డాడు. మృతుడు కృష్ణకు ఇద్దరు కుమార్తెలు కాగా, సంజయ్కు ఇద్దరు కుమారులు, సురేశ్కు కొడుకు, కూతురు, వాసుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను చౌటపల్లి తరలించనున్నారు. ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందడంతో అటు సూరత్లోను, ఇటు చౌటపల్లిలోనూ విషాదం అలముకుంది.