హైదరాబాద్/సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీపీజేఏ), రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల విజేతలను శుక్రవారం ప్రకటించారు. విజేతలకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని టీపీజేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు జీ భాస్కర్ తెలిపారు. ఈ పోటీల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన అముముల యాకయ్యకు ప్రథమ బహుమతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన డీ అశోక్కు ద్వితీయ బహుమతి, హైదరాబాద్కు చెందిన నవీన్ జెల్లాకు తృతీయ బహుమతి లభించింది. మూడు క్యాటగిరీల్లో మొత్తం 30 ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు.
‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట
‘నమస్తే తెలంగాణ’ ఫొటో గ్రాఫర్లకు పలు అవార్డులు లభించాయి. 2022 సంవత్సరానికి ద్వితీయ బహుమతితోపాటు 8 కన్సొలేషన్ బహుమతులు, 2023 సంవత్సరానికి 9 కన్సొలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి బందిగె గోపి (మహబూబ్నగర్, ద్వితీయ బహుమతి), ఎం శ్రీనివాస్ (మంచిర్యాల), వెంకన్న (వరంగల్), ప్రతాప్ (వరంగల్), వినోద్ (వనపర్తి), చంద్రశేఖర్ (జనగామ), రవికుమార్ (రాజన్న సిరిసిల్ల), పీ సైదిరెడ్డి (సూర్యాపేట), ఆర్ ఆకాశ్ (నల్లగొండ)కు కన్సొలేషన్ బహుమతులు లభించాయి. 2023 సంవత్సరానికి కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నవారిలో ఆర్ ఆకాశ్( నల్లగొండ), మేరుగు ప్రతాప్ (వరంగల్), బందిగె గోపి (మహబూబ్నగర్), జీ శ్రీనివాస్ (హైదరాబాద్), కపిలవాయి రాజు (నాగర్కర్నూల్), యాదిరెడ్డి (వనపర్తి), పీ సైదిరెడ్డి (సూర్యాపేట), జీ చిన్నయాదగిరిగౌడ్ (హైదరాబాద్), నరేశ్ (యాదాద్రి భువనగిరి) ఉన్నారు.