హైదరాబాద్ : ఉప్పల్ భగాయత్లో రెండు ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ. 70 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పతాక శీర్షికలో నిలిపారని కొనియాడారు. రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న ఈ భవనాన్ని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అంతా బాసటగా నిలవాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఇది కేసీఆర్ ఘనత అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.
క్రైస్తవులంటే సీఎంకు ఎంతో గౌరవం అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రధాన కారకుడు మంత్రి కొప్పుల ఈశ్వర్ అని పేర్కొన్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఒత్తిడి చేసి కొంత ఆలస్యమైనప్పటికీ అత్యంత విలువైన ప్రాంతంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపజేశారని తెలిపారు. 32 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రైస్తవులకు మేలు జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సమాజంలో క్రైస్తవులు ఎంతో సేవాభావం కలిగిన వారు అని తెలిపారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలనిక్రైస్తవులను కోరారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహ్మద్ అలీ, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, స్టీఫెన్ సన్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర,ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు రజిత, బొంతు శ్రీదేవి, క్రిస్టియన్ నాయకుడు రైడాన్ రోస్, పలువురు క్రైస్తవ మత పెద్దలు, బిషప్లు, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.