హైదరాబాద్ సిటీబ్యూరో/ఉప్పల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన జైన భవన్ నిర్మాణ పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ.1200 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్నదని, అన్నివర్గాల సంసృతి, ఆచారాలను గౌరవిస్తున్నదని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నగరానికి వచ్చి స్థిరపడిన వారందరికీ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. దేశంలో ఎకడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
స్వరాష్ట్రంలో బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, అభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయిన కిషన్రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఈ నాలుగేండ్లలో ఏం చేశారో చెప్పగలరా అని తలసాని ప్రశ్నించారు. సమర్థవంతమైన శాంతిభద్రతల కారణంగానే నగరవాసులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవానాల నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి, నిధులు ఇస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే జైన భవనం కోసం సుమారు రూ.100 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని కేటాయించినట్టు వివరించారు. మాసబ్ట్యాంక్లోని మహావీర్ హాస్పిటల్కు ప్రస్తుతమున్న లీజు స్థలాన్ని హాస్పిటల్కే సొంతంగా కేటాయించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుభాశ్రెడ్డి, సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, జైన్ సేవా సంఘం అద్యక్షుడు యో గేశ్, హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.