KTR | మహబూబ్నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశం నివ్వెరపోయేలా తెలంగాణలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారిచూపినట్టే.. వంటనూనెల దిగుమతిని తగ్గించేలా తెలంగాణకు దారిచూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామంలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్రీ యూనిక్ ఆయిల్ ఫ్యాక్టరీకి శుక్రవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్పవర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమేనని, కానీ ఇప్పుడది 3.5 కోట్ల టన్నులకు పెరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో ఐదారుగురు మంత్రులతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దగ్గరకు వెళ్లామని, ధాన్యం ఉత్పత్తి గురించి చెబితే ఆయన నమ్మబుద్ధి కావట్లేదని అన్నారని పేర్కొన్నారు. 75 ఏండ్లలో కాని పని ఐదేండ్లలో ఎట్లా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదని ఆశ్చర్యపోయారని తెలిపారు. ‘క్యా చమత్కార్ కర్దియా ఆప్ నే’ అని అన్నారని గుర్తు చేసుకున్నారు.
నాడు మైగ్రేషన్.. నేడు ఇరిగేషన్
దేశం మొత్తం మీద రైతుబంధు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్ అని, ఇప్పుడు ఇరిగేషన్ అని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కావడంతోపాటు భవిష్యత్తులో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. ఒకప్పుడు చెరువు కింద చేను ఉందని చెప్పేవారని, ఇప్పుడు చేను కిందకు చెరువు వచ్చిందని తాండూరు మండలం ఐతో లు రైతు, ఎస్వీఎస్ యజమాని కృష్ణారెడ్డి చెప్పారని తెలిపారు. నాడు మనకు అందకుండా కిందకుపోయిన కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి రైతుల పొలాలకు మళ్లిస్తున్నామని చెప్పా రు. వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితోపాటు వ్యవసాయం బలోపేతమవుతున్నదన్నారు.
ప్రస్తుతం విదేశాల నుంచి 70 శాతం వంటనూనెలను దిగుమంతి చేసుకుంటున్నామని, భవిష్యత్తులో తెలంగాణ వంటనూనెలు ఎగుమతులు చేసేలా ప్రోత్సహిస్తామని వివరించారు. వచ్చే ఐదేండ్లల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్వయంగా ఆయిల్పాం సాగుచేసి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. 14 కంపెనీలతో ఆయిల్పాం సాగుకు ప్రోత్సాహం అందించి అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఏడాదికి లక్ష పై చిలుకు ఆదాయం ఆయిల్పాం సాగుతో సాధ్యం అవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఆయిల్పాం ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉపాధి కల్పిస్తామని, అవసరమైతే ప్రభుత్వం తరపున యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆహారశుద్ధి పరిశ్రమలకు పెద్ద పీట వేసి భవిష్యత్తులో తెలంగాణలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా చూస్తామన్నారు.
జిల్లాలో తొలి ఆయిల్ ఫ్యాక్టరీ: మంత్రి నిరంజన్రెడ్డి
ఆయిల్పాం సాగు రైతుకు భరోసానిచ్చే క్రమంలో 40 ఎకరాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఫ్యాక్టరీ సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన మేరకు ఆయిల్పాం సాగువైపు రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరమని.. ఇందులో ఎక్కువమొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆయిల్పాం సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పినట్టు తెలిపారు. 35 ఏండ్లల్లో 39 వేల ఎకరాల్లోనే ఆయిల్పాం సాగవుతున్నదని, ఈ రెండేళ్లలోపే 1.22 లక్షల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పాం సాగు చేపట్టినట్టు వివరించారు.
త్వరలోనే రెండు లక్షల ఎకరాలకు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కోతులు, చీడపీడల బెడదలేని పంట ఆయిల్పాం అనేది రైతులు గ్రహించాలన్నారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసే క్రమంలో కరెంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమాతో పాటు వందశాతం కొనుగోళ్లు చేపట్టామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రజనీసాయిచంద్, ఆంజనేయగౌడ్, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.