హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ లాంటి ఉత్తమ లౌకిక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల, ముస్లింల అదృష్టమని బీహార్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ జమాఖాన్, రాజ్యసభ మాజీ సభ్యుడు సలీమ్ అన్సారీ (ఉత్తరప్రదేశ్) పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం జరిపేందుకు శుక్రవారం రాష్ర్టానికి విచ్చేసిన వీరికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలను అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వీరు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా రాష్ర్టాల్లోని ప్రభుత్వాల పనితీరు, వివిధ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న షాదీ ముబారక్, సీఎం ఓవర్సీస్ సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాల గురించి మంత్రి మహమూద్ అలీ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అనతికాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు. తమ రాష్ట్రాలను సందర్శించాలని మంత్రి మహమూద్ అలీని ఆహ్వానించారు. మైనార్టీల సంక్షేమం, సముద్ధరణ, అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి తెలుసుకొనేందుకు ఈ బృందం శనివారం ఉదయం బంజారాహిల్స్లోని మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యాలయంలో భేటీ కానున్నది. మంత్రి కొప్పుల సమక్షంలో రాష్ట్ర అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా కార్యక్రమాల వివరాలను వారికి తెలియజేయనున్నారు.