హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ నేత జైరాం రమేశ్, ఎంపీ ఆర్ కృష్ణయ్య శనివారం భేటీ అయ్యారు. శాసనసభకు వచ్చిన వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంని కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాలు, ఇటీవల జరిగిన ఎన్నికల గురించి సీఎంతో జైరాంరమేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. బీసీ రిజర్వేషన్లు, ఇతర సమస్యల పరిష్కారంపై సీఎంతో ఆర్ కృష్ణయ్య చర్చించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో ఏర్పాటుచేసిన ఈ విందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులూ పాల్గొన్నారు.