మంథని, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు మార్చి 17లోగా అమలుకాకపోతే ఉద్యమించుడేనని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలంటే తెలియని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మంథని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాకేసీఆర్ తన పదవీకాలంలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం తప్ప ఎన్నడూ కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపని గొప్ప నాయకుడని కొనియాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూములకు సాగు నీరు అందక బీళ్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్కు నాయకుడు లేక పూటకో పార్టీ తిరిగే రేవంత్రెడ్డిని సీఎంను చేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, 2వ తేదీ దాటినా ఆ ఊసే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలంతా ఇప్పుడు బాధ పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాలనను, కేసీఆర్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఇక కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు.