ముంబై/శంకరపట్నం, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): సోలాపూర్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత సా దుల ధర్మన్న (81) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ధర్మన్న మరణం పార్టీకి తీరని లోటన్నారు. బీఆర్ఎస్లో చేరిన తొలి మహారాష్ట్ర నేత ఆయనేనని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎదుగుతున్న సమయంలో ధర్మన్న మరణం బాధించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ధర్మన్న మృతి బాధాకరమని పార్టీ మహారాష్ట్ర ఇంచార్జి కే వంశీధర్రావు పేర్కొన్నారు. ధర్మన్న కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్లో జన్మించారు. ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్లి స్థిరపడ్డారు. సోలాపూర్లో చేనేత కంపెనీ స్థాపించారు. సోలాపూర్ కార్పొరేటర్గా రెండుసార్లు, మేయర్గా ఒకసారి పనిచేశారు.