టేకుమట్ల, సెప్టెంబర్ 5 : గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలేదని మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం… జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుశాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ పండుగ శ్రీనివాస్యాదవ్ తన పదవీకాలంలో గ్రామంలో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు.
పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నుంచి అందడంలేదని, అప్పులకు వడ్డీ పెరుగుతున్నదని సన్నిహితులకు చెప్తూ బాధపడేవాడు. రూ.19 లక్షల పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ శనివారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట పురుగులమందు తాగాడు.. కుటుంబసభ్యులు వెంటనే చిట్యాల సామాజిక దవాఖానకు తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.