హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): లిక్కర్ అక్రమ కేసు కారణంగా బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతిన్నదని కేటీఆర్ ఎక్స్లో పెట్టిన పోస్టులో తప్పేమున్నదని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. కవిత ఉదయం మాట్లాడిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని పేర్కొన్నారు. కేటీఆర్పై కవిత చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు. ఆమె మాట్లాడాల్సింది, నిందించాల్సింది తనపై తప్పుడు కేసు పెట్టిన బీజేపీ గురించి, దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ గురించి అని హితవు చెప్పారు.
కవిత బీజేపీ, కాంగ్రెస్ను పక్కనబెట్టి బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమని అన్నారు. ఆమె వైఖరి చూస్తుంటే కేసుల పాల్జేసిన, దుష్ప్రచారం చేసిన వారి పంచన చేరినట్టు అర్థమవుతున్నదని వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితకు మొదటి నుంచి అండగా ఉన్నది బీఆర్ఎస్ మాత్రమేనని, ఈ విషయం తెలంగాణ సమాజానికి తెలుసని పేర్కొన్నారు.