కరీంనగర్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా.. అప్పుల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది’ అని మాజీ ఎంపీ వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులే కాదు.. ఆయన సృష్టించిన ఆస్తుల వివరాలు కూడా ప్రజలకు వివరించాలని హితవుపలికారు. బుధవారం కరీంనగర్ ప్రతిమ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో 2001 నుంచి 2014 వరకు రాజీలేని పోరాటం చేసి తెంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు తెచ్చుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని గుర్తుచేశారు.
విద్యుత్తు మెరుగుదల కోసం వెచ్చించిన అప్పులే తమకు కనిపిస్తున్నాయి కానీ.. 93 వేల కోట్లకు పెరిగిన ఆస్తులు కనిపించడం లేదా? ఆ విషయాలను ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నాడు కేవలం ఐదు మెడికల్ కళాశాలలు ఉంటే.. నేడు 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు. రూ.617 కోట్లతో సచివాలయం నిర్మిస్తే, దానికి వేల కోట్లు పెట్టామని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గుర్తించాలని, అప్పులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలను నమ్మకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం వంద రోజుల తదుపరి నిలదీయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మే యర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.