అశ్వారావుపేట, జూలై 22: నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు సీనియర్లకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, వర్గాలను పెంచి పోషిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో చేరికల పేరుతో మాజీ ఎంపీ పొంగులేటి శనివారం అశ్వారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సత్యసాయి కల్యాణ మండలంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జడ్పీటీసీ, పీసీసీ మెంబర్ సున్నం నాగమణి, ఇతర ముఖ్య నాయకులు గైర్హాజరయ్యారు.
పొంగులేటి పర్యటిస్తున్నట్టు తమకు సమాచారం లేదని, అందుకే హాజరు కాలేదని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్లో తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు పొంగులేటి సొంత ఖర్చులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సీనియర్లను విస్మరిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆయన తీరు కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా ఉందని, సీనియర్లను విస్మరిస్తే క్యాడర్ ఆయనకు భవిష్యత్లో తగిన గుణపాఠం చెప్తుందని పేర్కొన్నారు. పొంగులేటి చేరిక సమయంలో కలిసి పని చేయాలని అధిష్ఠానం సూచించిందని, ఆ మేరకు పార్టీ కోసం కలిసి పని చేస్తామని అంగీకరించామని, అయినా తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టీపీసీసీ మెంబర్, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు.
చండ్రుగొండలో రెండుగా చీలిన కాంగ్రెస్
చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. శనివారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వరావుపేట పర్యటనకు మండలం నుంచి కేవలం పొంగులేటి వర్గీయులు మాత్రమే బయలుదేరి వెళ్లారు. దీంతో మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాకుండా.. ఆయన క్యాంపు కార్యాలయం నుంచే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నాయకులు, శ్రేణులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అసలు పార్టీలో ఐక్యత ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. పాత కాంగ్రెస్ శ్రేణులంతా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వర్గీయులుగా, కొత్త వారంతా పొంగులేటి వర్గీయులుగా చీలిపోయారని స్పష్టమవుతున్నది. ఏది ఏమైనా పొంగులేటి క్యాంపు కార్యాలయం మూసివేయాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.