బంజారాహిల్స్, ఫిబ్రవరి 6: డబ్బులు డిమాండ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వర్రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లో మాజీ కే వెంకటేశ్వరరావు, కేకే కుమార్తె కవితారావుకు ఇల్లు ఉంది. ఈ స్థలాన్ని దాదాపు 30 ఏండ్ల కింద ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశారు. అయితే సుప్రీంకోర్టులో ఈ స్థలం ప్రభుత్వానిదని తేలడంతో తమకు క్రమబద్ధీకరించాలని వారిద్దరూ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 56 ద్వారా ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించింది. ఆ జీవోను రద్దు చేయాలని, జీవో 59 కింద మార్కెట్ విలువను లెక్కించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్రెడ్డి మూడునెలల క్రితం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది. ఇటీవల గడీల రఘువీరారెడ్డి, అన్వేష్రెడ్డి తమను వాట్సాప్ కాల్స్, చాటింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారని, రూ.3కోట్లు ఇస్తే కేసును వెనక్కి తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ వెంకటేశ్వరరావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కోరిన విధంగా రూ.3 కోట్లు ఇవ్వకపోతే మరిన్ని కేసులు వేసి వేధిస్తామని వారు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు రఘువీరారెడ్డి, అన్వేష్రెడ్డిల మీద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.