హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన 2014 నుంచి 2019 వరకు 106 సార్లు నియోజకవర్గ, తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడానని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. కొందరు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది.. కేంద్రంలో బీజేపీ ఉంది.. బీఆర్ఎస్ ఎందుకు అంటున్నారని, పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడే ఎక్కువగా అవసరం ఉంటుందని అన్నారు. కరీంనగర్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కదనభేరిలో వినోద్కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్లమెంట్లో గులాబీ జెండా ఉండాలని చెప్పారు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు 2014లో మొదటిరోజు పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ సూచనల మేరకు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడి కరీంనగర్ స్మార్ట్సిటీని సాధించామని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఐదు రూపాయలు కూడా తీసుకరాలేదని విమర్శించారు.
స్మార్ట్సిటీ ద్వారా తాను రూ.1000 కోట్లు తీసుకవచ్చానని చెప్పారు. కరీంనగర్కు రైలును సాధించామని, ఐదు జాతీయ రహదారులు మంజూరు చేయించానని తెలిపారు. కరీంనగర్ నియోజకవరార్గంలో ఎన్నో పనులు చేశానని, తనకు ఎందుకు ఓటు వెయ్యరని వినోద్కుమార్ ప్రశ్నించారు. త్రిపుల్ ఐటీ గురించి ఒక్కరోజు కూడా బండి మాట్లాడలేదన్నారు. ఒక్క నవోదయ విద్యాలయాన్ని కూడా సాధించలేదని అన్నారు.ఎమ్మెల్యేగా ఓడిపోయినవారు ఎంపీగా పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాను కాబట్టి సానుభూతితో ఓటు వేయాలని కొందరు అడుగుతున్నారని బండి సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడాను గ్రామాల్లో చర్చించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు మళ్లీ మార్పు జరగాలని కోరుకుంటున్నారని, కేసీఆర్ సీఎంగా ఉండాలని ఆశిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాతో సహా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి
తెలంగాణ ప్రయోజనాలను కాపాడలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే సాధ్యం అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పవిత్ర లక్ష్యం కోసం 2001లో ఇదే గడ్డ నుంచి సింహగర్జన పేరుతో సభ నిర్వహించామని, తెలంగాణ సాధించామని గుర్తుచేశారు. మళ్లీ ఇదే గడ్డ మీద కేసీఆర్ అడుగుపెట్టగానే నేలంతా పులకించిపోయిందని అన్నారు. గొప్ప గొప్ప పథకాలను కరీంనగర్ నుంచే ప్రారంభించామని అన్నారు. పది సంతవత్సరాలు రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాకముందు పార్లమెంట్లో మన వాయిస్ వినిపించే నాయకుడు లేడని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడే అవకాశం లేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా మరోసారి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు.