రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సెంటు భూమిలేని రాములు
దళితబంధుతో ఆ కుటుంబానికి ఆసరా
ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 8 : మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దళితబంధు కింద లబ్ధిచేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సెంటు భూమి కూడా లేకపోవడంతో దళితబంధు పథకాన్ని మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన కొండిగారి రాములు ఇబ్రహీంపట్నం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994లో సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన గెలుపొందిన ఆయన ఒక్క సెంటు భూమికూడా సంపాదించలేదు. ఇప్పటికీ ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. దళితబంధు ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. వెంటనే అధికారులను ఆదేశించడంతో మాజీ ఎమ్మెల్యే కుమారుడు త్రిలోక్కుమార్కు దళితబంధు పథకం కింద కారు మంజూరు చేశారు. కాగా శుక్రవారం ఈ కారును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి.. కొండిగారి రాములు కుటుంబానికి అందజేశారు.
దళితబంధు పథకం దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ ఆచరణలోకి తీసుకొచ్చిన దళితబంధు ఎంతో గొప్ప పథకం. ఆయన మదిలో మెదిలిన ఈ పథకం ఎంతోమంది దళితకుటుంబాలను ఆదుకుంటున్నది. జీవనోపాధిలేక ఇబ్బంది పడుతున్న నా కుమారుడికి ప్రభుత్వం దళితబంధు పథకం కింద కారు మంజూరు చేసింది. ఈ కారుతో జీవనోపాధి లభించే అవకాశం దొరికింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు.
– కొండిగారి రాములు, మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
చాలా సంతోషంగా ఉన్నది
మా నాన్న పదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి మాకు ఎలాంటి ఆస్తులు సంపాదించి ఇవ్వలేదు. మాకు తాతలు సంపాదించిన ఆస్తులు కూడా లేవు. నాకు దళితబంధు పథకం కింద కారు అందజేయటం సంతోషంగా ఉన్నది. కారు నడుపుతూ జీవనోపాధి పొందుతా.
– త్రిలోక్కుమార్, మాజీ ఎమ్మెల్యే రాములు కుమారుడు