హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఆవిర్భావ రజతోత్సవ సంరంభానికి అడుగుపెడుతున్న అపురూప సందర్భమిది. ఈ అద్భుత ఘట్టాన్ని అంబరాన్నంటేలా నిర్వహించాలని గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమసారథి కేసీఆర్ దార్శనికతతో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన (ఏప్రిల్ 27, 2001లో) తొలినాళ్లలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. 2001 జూలైలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో ప్రజ్వరిల్లింది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గులాబీ రంగు జెండాపై రైతు నాగలి గుర్తుతో పోటీచేసి 85 మంది జెడ్పీటీసీలు, వందలాది మంది ఎంపీటీసీలు విజయకేతనం ఎగురవేశారు.
కరీంనగర్, నిజామాబాద్ రెండు జిల్లా ప్రజాపరిషత్లపై గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. ఆ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా పెద్ది సుదర్శన్రెడ్డి విజయం సాధించారు. ఆ సందర్భంలో క్లాత్ మీద బ్రష్తో రాయించిన ఎన్నికల ప్రచార బ్యానర్ను, పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం అధినేత కేసీఆర్తో పునరావిషరణ చేయించారు. ఆనాటి పార్లమెంటరీ ఉద్యమపంథా పోరాట జ్ఞాపకాలను పెద్ది సుదర్శన్రెడ్డి సహా ఇతర నేతలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా నాటి ప్రచార బ్యానర్ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.