కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 30: తమ స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యే కడియం శ్రీ హరి, రాజ్యసభ సభ్యు డు కే కేశవరావు రంగు లు మార్చుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా వారి తీరు ఉన్నదని, దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచి చూపాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుంకె మాట్లాడుతూ.. కడియం, కేకేపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.
ఏ పదవీ లేకుండా ఇంట్లో ఉన్న కడియంను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు తీసి ఉపముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని, కేశవరావును కాంగ్రెస్ ఛీకొడితే కేసీఆర్ అక్కున చేర్చుకుని పార్టీ సెక్రటరీ జనరల్గా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న వీళ్లు మేక తోలు కప్పుకొన్న తోడేళ్లని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిని చరిత్ర హీనులుగా మారుతారని జోస్యం చెప్పారు. వీరిని చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువవడంతోనే బీఆర్ఎస్ నాయకులను లాక్కుంటున్నారని విమర్శించారు. ‘గుంపు మేస్త్రీ.. ఇక నీ పని ఖతమే’నంటూ సీఎం రేవంత్ను ఉద్దేశించి కడియం చేసిన వ్యాఖ్యలు మరిచి.. కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.