హైదరాబాద్ : పంట నష్టంపై(Crop damage) మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Mallaiah Yadav) డిమాండ్ చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మెతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు, మోతే గ్రామాల్లో ఎండిన పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు జరుగలేదన్నారు. మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. రైతుల ఆహ్వానం మేరకే ఎండిపోయిన పంటలను పరిశీలించామన్నారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.