పరిగి, జనవరి 30: పూడూరు మండలంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. 2009లోనే రాడార్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. మంగళవారం పూడూరు మండలం మన్నెగూడ అతిథిగృహంలో మాట్లాడుతూ ప్రభుత్వం అటవీ భూమిని నేవీకి అప్పగించడం, జీవో జారీ చేయడం తగదని అన్నారు. రాడార్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం రాకముందే మొదటి అనుమతులు వచ్చాయని చెప్పారు. అనంతరం పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, పూడూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజల కోరిక మేరకు కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లపాటు రాడార్ కేంద్రాన్ని ఆపిందని వివరించారు.
రాడార్ ఏర్పాటుతో ఇక్కడి అడవిలోని 12,12,750 చెట్లను నరికివేయడంతోపాటు 157 రకాల పక్షులు నశించిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాడార్తో చుట్టుపక్కల గ్రామాలకు రేడియేషన్ ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీచేసి అటవీ భూమిని నేవీకి అప్పగించడం, రాడార్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పడం అనుమానం కలుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాడార్ కేంద్రం ఏర్పాటుతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని, ఈ ప్రాంతం వారికి ఎలాంటి ఉద్యోగాలు రావని తెలిపారు. ఎవరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉంటామని తేల్చి చెప్పారు. కోర్టులో తమకు సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజహరుద్దీన్, దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులు సదానందస్వామి, దయానంద్గౌడ్, రాజేందర్, దేవనోనిగూడెం వెంకటయ్య, రామన్నమాదిగ తదితరులు పాల్గొన్నారు.