హాలియా, జనవరి 29: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ సమీపంలో సూరేపల్లి మేజర్ వద్ద కోదాడ-జడ్చర్ల 167వ జాతీయ రహదారిపై రైతులతో కలిసి సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, బోర్లను నమ్ముకొని ఎడమ కాల్వ కింద ఉన్న 30 శాతం మంది రైతులు వరి పంటను సాగు చేశారని తెలిపారు. రైతులు ఎకరానికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారని చెప్పారు. చెరువులు, బావులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే తాగు, సాగునీటి కోసం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేసి చెరువులు, కుంటలను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల నీరు ఉన్నప్పుడు కూడా రైతు సంఘాల ఒత్తిడి మేరకు నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు. వారబందీ ప్రకారం నీటిని విడుదల చేసి రైతున్నను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులను కలిసి వినతిపత్రం అందజేసినా ప్రభుత్వంలో కదలిక లేదని విమర్శించారు. నాగార్జునసాగర్లో సరిపడా నీటి నిల్వ లేకపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి నుంచి నీటిని తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. లేదంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కూన్రెడ్డి నాగిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.