ఆర్మూర్టౌన్, మే 9: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న జీవన్రెడ్డి కుటుంబ సభ్యులు, మరికొందరు కలిసి విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట షాపింగ్ మాల్ నిర్మించారు. ఈ మాల్కు సంబంధించి రూ.3.14 కోట్ల బకాయిలు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలని మూడు నెలల క్రితం అధికారులు జీవన్రెడ్డికి నోటీసులు జారీచేశారు. నోటీసులకు స్పందించకపోతే మాల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మాల్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించగా.. బకాయిల చెల్లింపునకు నెల రోజుల గడువునిచ్చింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు, పోలీసులు గురువారం జీవన్రెడ్డి మాల్కు వచ్చారు. కోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని, ఈ రాత్రి 8 గంటల్లోపు బకాయిలు చెల్లించకపోతే మాల్ను సీజ్ చేస్తామని మైక్లో అనౌన్స్ చేశారు. గడువులోపు డబ్బులు కట్టకపోతే మాల్ను సీజ్ చేస్తామన్న అధికారులు అర్ధరాత్రి వరకు అటువైపు రాలేదు.