హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత, మాజీ సైనికుడు మల్లేశ్ హత్యపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణభవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పార్టీ సీనియర్ నేత అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుల ప్రమేయం లేకుంటే వారి కుటుంబాన్ని ఆయన ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
రాజకీయ కారణాలతోనే మల్లేశ్ను హత్య చేశారని, న్యాయవిచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు తెరలేపిందని, ఇవి ఇంతటితో ఆగేలా లేవని గువ్వల బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మంత్రిగా హత్యా రాజకీయాలను జూపల్లి నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ అన్నారని, జూపల్లిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ఇలానే వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.