హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పోలీసులు భద్రత రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 డిసెంబర్ వరకు తనకున్న 3+3 సెక్యూరిటీని ఉపసంహరించడాన్ని తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేశారు.
త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ప్రచారం నిమిత్తం ప్రజల్లోకి వెళ్లనున్నానని, తీవ్రవాదుల (నక్సల్) నుంచి ముప్పు ఉన్న తనకు 2+2 భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు హోంశాఖను, డీజీపీని, ఐజీపీని, ఇంటెలిజెన్స్ విభాగాన్ని, వరంగల్ సీపీని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉన్నది.