ఖైరతాబాద్, ఏప్రిల్ 2: సర్వాయి పాపన్నగౌడ్ పోరాటాన్ని బీసీలు స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బహుజన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా ఆత్మ బలిదాన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఇతర నేతలతో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్వాయి పాపన్న, కుమ్రంభీం, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు. చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తేనే ఆ జాతులు బాగుపడుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికోసం బీసీలు జాతీయస్థాయిలో ఐక్య పోరాటాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ కుమార్గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశ్చారి, గౌడ సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాబాగౌడ్, జై గౌడ జాతీయ సంఘం అధ్యక్షుడు వట్టికూటి రామారావుగౌడ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్కుమార్గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.