ఖమ్మం, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ వివక్ష ధోరణులను వ్యతిరేకించే ప్రతి పార్టీ కేసీఆర్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్తో కలిసి అడుగులు వేసే అవకాశం ఉన్నదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందని చెప్పారు. కేసీఆర్ మాత్రమే దేశాన్ని సరైనదారిలో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం, జాతీయస్థాయిలో ప్రభావంపై ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు.
బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉండబోతున్నది?
అసాధ్యాన్ని సుసాధ్యంగా మలిచే శక్తి, దేశ ప్రజల కష్టాలు, కన్నీళ్లను తీర్చగలిగే వ్యక్తి సీఎం కేసీఆరే. తెలంగాణను సాధించి, అభివృద్ధి చేసిన తీరే దీనికి నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీకి మరో ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలంతా కోసం ఎదురుచూస్తున్న తరుణం లో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది. యావత్ భారతావని అటువైపే దృష్టిసారించింది. తెలంగాణలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పాటుపడుతూ అందరివాడుగా పేరొందిన కేసీఆర్తోనే తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తక్కువ కాలంలోనే బీఆర్ఎస్ రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించటం ఖాయం.
నాయకుల అసమర్థతే దేశానికి శాపం
దేశంలో అపార సహజ వనరులున్నా గత ప్రభుత్వాలు సమర్థంగా వినియోగించుకోలేకపోవటంతో దేశం అభివృద్ధి చెందలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే వనరులన్నింటినీ వినియోగించుకొని దేశానికే తెలంగాణను మాడల్గా నిలిపిన కేసీఆర్ దార్శనికతను దేశం కోరుకుంటున్నది. సమర్థ పాలనాదక్షుడిగా పేరున్న కేసీఆర్ దేశాన్ని సరైన దిశలో నడిపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
విద్యుత్తు, తాగు, సాగునీటి పథకాలు, రైతు సంక్షేమం, పేదవర్గాల సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దేశవ్యాప్తం చేయడం బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం. బీజేపీ దశాబ్దాలుగా గొప్పగా చెప్పుకొంటున్న గుజరాత్ మాడల్ గ్రాఫిక్స్కే పరిమితమైంది. అక్కడ ఇప్పటికీ విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అం దించాం. ఈ తరహా అభివృద్ధి దేశంలో కొనసాగాలని ప్రజలు ఆశిస్తున్నారు.
సీనియర్ నేతగా బీఆర్ఎస్లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. ఏవిధంగా వినియోగించుకోవాలో, శక్తి సామర్థ్యాలు ఏమిటో, రాజకీయ నిబద్ధత ఏమిటో అధినేత కేసీఆర్కు తెలుసు. ఎక్కడా ఎలా వినియోగించుకుంటారనేది వారి ఇష్టం. మంత్రి గా పని చేసిన అపార అనుభవాన్ని పార్టీ పురోభివృద్ధికి ఉపయోగిస్తా.
కలిసి వచ్చే రాజకీయ పక్షాలేవి?
బీజేపీ వివక్షను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ బీఆర్ఎస్కు సహకరించే అవకాశం ఉన్నది. గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, జనతా పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటుచేశాయి. అసమర్థ కాంగ్రెస్ను ప్రజలు పక్కన పెట్టడంతో అప్పుడు సాధ్యమైంది. ఇప్పుడు నియంతృత్వ బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్తో కలిసివచ్చేందుకు అనేక పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ప్రత్యామ్నాయాన్ని సృష్టించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం.
బీఆర్ఎస్తోనే మేలు
బీఆర్ఎస్తో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. సీఎం కేసీఆర్తోనే సమానత్వ పాలన సాధ్యమవుతుంది. తెలంగాణ ను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా పనిచేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. తెలంగాణ ముస్లిం, క్రైస్తవ, ఇతర మైనార్టీ వర్గాల అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది.’
– అబ్దుల్ ముబీన్, రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ