హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అసలు మనిషేనా.. ఆయనకు మానవత్వం ఉందా…? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కోల్పోయిన తన భర్తను గుర్తుచేసుకుని బాధతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామా, యాక్షన్ అంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఓట్లు వేస్తే.. అదే సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గెలిచి మంత్రి అయ్యారని గుర్తుచేశారు.
ఇప్పుడు అదే కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చిందని, ఆయన భార్య, బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్, డ్రామా ఎట్లా అవుతుంది? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలన్నారు. పొన్నం ప్రభాకర్ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఎమ్మెల్యేలు చనిపోతే ఉప ఎన్నికలు వచ్చాయని గుర్తుచేశారు.
పొన్నం ప్రభాకర్ అనుచితంగా మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారని, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ స్పందించి ఉంటే బాగుండేదని గౌడ్ అన్నారు. రాజీవ్గాంధీ చనిపోతే దేశవ్యాప్తంగా రాజీవ్గాంధీ ఫోటోలతో ప్రచారం చేయలేదా..? అని ప్రశ్నించారు. ఆడబిడ్డను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అవమానించారని విమర్శించారు. మంత్రుల భాషను మహిళలు విని ఓటేయాలన్నారు.