తెలుగు యూనివర్సిటీ, మే 4 : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను వెంటనే మానుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం రాత్రి కాగడాలు ప్రదర్శించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ స్పష్టతలేని జీవో7 వల్ల రాష్ట్రంలోని 14లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజు బకాయిలు విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పడంలో స్పష్టత లేదని, ఈ నిర్ణయం కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని ప్రోత్సహించేలా ఉన్నదని విమర్శించారు. ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. వెంటనే జీవో 7ని సవరించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నరసింహ నాయక్, సాయి, సానియా, ప్రత్యూష, వెన్నెల, ప్రజ్వల, అనూష, శృతి, ఐశ్వర్య, అంకిత, వైష్ణవి, అర్చన, రమ్య, కీర్తి, అక్షయ పాల్గొన్నారు.