మహబూబ్నగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలతో ఆడపిల్లలను కన్నెత్తి చూడాలన్నా, వేధించాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. రాష్టంలో ఇటీవల మళ్లీ ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతు న్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (Polytechnic College) సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఆకతాయి బాత్రూంలో ఫోన్ పెట్టి వీడియో రికార్డు చేస్తూ ఏమి తెలియనట్టు బుకాయించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు ఏ కళాశాలలో .. పాఠశాలలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యాలయాల్లో విద్యార్థినిలకు పూర్తి స్థాయి వసతులతో మూత్రశాలలు ఏర్పాటు చేయాలనీ కోరారు.
విద్యార్థినిలు ఏ సమస్యలు వచ్చినా ఉపాధ్యాయులకు చెప్పుకునేవిధంగా కళాశాలల్లో వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. గతంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. అది పూర్తి అయితే విద్యార్థినిలు నైపుణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
విద్యార్థినిలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులకు చెప్పాలని, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆకతాయిల బెదిరింపులకు బయడవద్దని, ధైర్యంగా వారిని ఎదుర్కో వాలన్నారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, తదితరులు ఉన్నారు.