హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్కు, నీటికి కటకట ఏర్పడిందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. మూడెకరాల రైతులకు రైతుబంధు సాయం వేయడానికి మూడు నెలల సమయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అవగాహనారాహిత్యంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
రాజకీయం, వ్యవసాయం ఒకే గాటన కట్టొద్దని హితవు పలికారు. ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు జరిగి ఉంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి శిక్షపడేలా చర్యలు తీసుకోచ్చని చెప్పారు. అంతేకానీ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బరాజ్, అందులో కుంగిన మూడు పిల్లర్లు మాత్రమే కాదని తెలిపారు. పిల్లర్ల సాకు చూపి రైతాంగం ఉసురు పోసుకోవద్దని సూచించారు. కాళేశ్వరంతో బీఆర్ఎస్ మహోన్నతను చెరిపేసేందుకు కాంగ్రెస్ దుర్బుద్ధితోనే దుష్ప్రచారం చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు దుష్ట వైఖరిని గడపగడపకూ తిరిగి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పంటలు ఎండిపోయిన రైతుల దుఃఖం చూస్తే బాధేస్తున్నదని, సాగునీచ్చి పంటపొలాలను కాపాడాలని నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.