Niranjan Reddy | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లలో యాసంగి పంటకు సరిపడా నీళ్లు ఉన్నా సర్కార్ ఇవ్వడం లేదని, అసలు రైతులకు నీళ్లు ఇస్తారా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. పంట కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడూ జాప్యం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను క్వింటాలుకు రూ.500 బోనస్తో కలిపి చెల్లించాలని డిమాండ్ చేశారు.
గురువారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధు విషయంలో మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుబంధు డబ్బులు వేశామని గత నెల 27 సీఎం రేవంత్రెడ్డి దబాయించగా, అందరికీ రైతుబంధు వచ్చిందని ఈ నెల 9న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార చెప్పారని, తీరా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి తరువాత వేస్తామని అసలు విషయం చెప్పారని గుర్తుచేశారు. ఇలా తలోమాట మాట్లాడటం వల్ల రైతుల్లో అయోమయం నెలకొన్నదని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకోవాలని చూడొద్దని హితవు చెప్పారు. వరంగల్ ఏనుమాముల, ఖమ్మం మార్కెట్ యార్డుల్లో మిర్చి రైతులు సరైన ధర రాక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కొత్త విద్యుత్తు పాలసీ తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వం.. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. కేసీఆర్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వెనుకడుగు వేస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగురవేస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాంనాయక్, పార్టీ నేతలు రవికుమార్, లింగంపల్లి కిషన్రావు, యాకుబ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.