హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ చేపట్టిన పాలమూరు-రంగారె డ్డి ప్రాజెక్టు సందర్శన ఒక ఝూటా యాత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ది శిఖండి పాత్ర అని విమర్శించారు. కాం గ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని పాలమూరు-రంగారెడ్డి సందర్శనకు వస్తున్నారని నిలదీశారు.
పాలమూరు వలసలు, రైతులు, కూలీల చావులకు కారణమైన కాంగ్రెస్ నేతలు ముకు నేలకు రాసి జిల్లాలో అడుగుపెట్టాలని డిమాం డ్ చేశారు. ‘వందల కేసులు వేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో జాప్యానికి కారణమైంది కాంగ్రెస్ నేతలు కాదా? ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయిలో సాగునీళ్లు ఇవ్వకుండా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నష్టపోయేందుకు కారణమైంది కాంగ్రెస్ కాదా?’ అని నిలదీశారు.
కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను తాకట్టుపెట్టి దక్షిణ తెలంగాణకు తీరనిద్రోహం చేసిందని మండిపడ్డారు. ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా గురించి కాంగ్రెస్ ఎన్నడైనా అడిగిందా? అధికారంలోకి వచ్చి మూ డు నెలలవుతున్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు సమీక్షించలేదు? ఇప్పటికే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టు పనులను కొనసాగించకుండా దాదాపు రూ.7 వేల కోట్ల టెం డర్లు ఎందుకు రద్దు చేశారు? ఆదరాబాదరాగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టడం ఎవరి ప్రయోజనం కోసం?’ అని ప్రశ్నించారు. బీఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు విఫలయత్నం అని చెప్పేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
అపర భగీరథుడు కేసీఆర్
బీఅర్ఎస్ పార్టీ నల్లగొండ సభ పెడితే కాంగ్రెసోళ్లు మేడిగడ్డ సందర్శన చేపట్టారని, ఇప్పుడు బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన అంటే పాలమూరు సందర్శనకు బయలుదేరుతున్నారని నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. హరిహరబ్రహ్మాదులు అడ్డొచ్చినా పాలమూరును ఆపలేరని సవాల్ చేసి, పాలమూరు కలను నిజం చేసిన భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. ఎన్నో చికుముడులను విప్పి, కోర్టుల్లో స్టేలను ఎత్తేయించి అనుమతులు సాధించింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వేలాది చెరువులను మత్తళ్లు పోయించామని తెలిపారు. పాలమూరులో బంగారు పంటల దృశ్యాలను చూపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సింది పోటీ యాత్రలు కాదని, రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీని దమ్ముం టే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా పై నిలదీయాలని సవాల్ చేశారు.