హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి, తాగునీటి కొరతకు కారణమైన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పులు, అనాలోచిత, అనుభవరాహిత్య చర్యల వల్ల రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ ప్రభుత్వానికి రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే రాజకీయాలే ముఖ్యంగా ఉన్నాయని మండిపడ్డారు.
కాళేశ్వరం నీటి ఎత్తిపోతలపై రాష్ట్ర మంత్రివర్గం సరైన సమయంలో స్పందించకపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. శనివారం తెలంగాణభవన్లో పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్పై మాట్లాడే రాష్ట్ర మంత్రులకు సిగ్గుండాలని ఫైరయ్యారు. గోదావరి జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని మంత్రి ఉత్తమ్ అనడాన్ని ఆక్షేపించారు. అసెంబ్లీలో నీటిపారుదల అంశంపై కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చర్చలో పాల్గొనకుండా పారిపోయింది ఎవరని నిలదీశారు.
అన్నారం, సుందిళ్లలో ఉన్న నాలుగు టీఎంసీల నీటిని కిందికి విడుదల చేయకుండా ఎల్లంపల్లిలోకి పంపింగ్ చేసి ఉంటే నీటికొరత సమస్య తగ్గేదని చెప్పారు. ఉమ్మడి వరంగల్ వరప్రదాయిని లాంటి దేవాదుల నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయలేదని నిలదీశారు. దీని కింద 19 రిజర్వాయర్లు ఉన్నాయని, 9 టీఎంసీల నీటిని నింపే అవకాశం ఉందని, 15 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉండేదని చెప్పారు.
వృథాగా సముద్రంలోకి 48 టీఎంసీలను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్న నీళ్లను వాడుకుంటామని అడిగే ధైర్యం లేని కాంగ్రెస్ మంత్రులు, రైతుల పక్షా న నిలబడతారా? అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి మళ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు జాతీయ మ్యానిఫెస్టోతో వచ్చిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మండిపడ్డారు.