హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సీఏఏపై కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి తమ వైఖరి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మహమూద్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వంద రోజులైనా మహిళలకు ఉచిత బస్సు మినహా మరే పథకం అమలు చేయడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నదని, మంత్రివర్గంలో ముస్లింలకు చోటే కల్పించలేదని దుయ్య బట్టారు. ఎమ్మెల్యే షకీల్ కుటుంబాన్ని ప్రభు త్వం, పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు బీఆర్ఎస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో మార్పు మొదలైందని, బీఆర్ఎస్ 12 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.