కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపించాలని ప్రభుత్వం నాటకాలు ఆడింది. నిన్నటి కేసీఆర్ పర్యటనతో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్కి వదిలారు. ఈ పని ముందే చేసి ఉంటే కరువు ఉండేది కాదు.
– ముషంపల్లిలో కేటీఆర్
Telangana | నల్లగొండ, ఏప్రిల్ 1: ‘మా అయ్య కేసీఆర్ ఉన్నన్ని రోజులు మాకు ఏ రంది లేదు. ఆయన ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. బుక్కెడు బువ్వ దొరికింది. మా అయ్య పక్కకు జరగంగనే మొత్తం పోయింది. ఈ సారి పంట మొత్తం ఎండిపోయింది. అప్పు అయ్యింది. మా అయ్య ఉన్నప్పుడు నాకు రైతుబంధు ఇచ్చిండు. ఆ పైసలతో పిండి బస్తాలు కొనేటోన్ని. వానకాలంలో రైతుబంధు ఇస్తే తోటలో పాదులకు కర్సు పెట్టిన. అప్పుడు అప్పే లేదు. ఖుషీగా ఉండే. ఇప్పుడు ఎండిపోయిన పొలం చూసి మందు తాగాలని చూసిన. ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయిండు. వాడికి చిన్న చిన్న కూనలున్నరు. వాళ్లను ఎట్లా సాదాలనేదే నా బాధ’ అంటూ నల్లగొండ జిల్లా ముషంపల్లికి చెందిన గన్నెబోయిన మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తన గోడు చెప్పుకుంటూ బోరున విలపించాడు. ఐదెకరాల పొలం ఎండిపోయిందన్న బాధతో 20 రోజుల కిందట మల్లయ్య ఆత్మహత్యకు ప్రయత్నించగా.. మీడియా ప్రతినిధులు ఆపి ఆయన చెప్పిన కష్టాలను వీడియో తీశారు. ఆ వీడియోలో.. ‘ఈ సారి కేసీఆర్ సారు లేక బత్తాయి తోటతో పాటు పొలమంతా ఎండిపోయింది. ఎండిన పొలం మేకల పాలైంది. బువ్వకాడికి పోతే సంతోషం లేదు. చేను కాడికి వస్తే కుషాల్ లేదు. చేసిన అప్పు తీరేదెట్ల? కొడుకు సచ్చిపోయిండు. వాడి చిన్నచిన్న కూనలను సాదేదెట్ల? కడుపు కుద్దుకుంటున్న. పురుగుల మందు తాగాలనిపిస్తుంది. లేదంట కంపల్ల పడి సచ్చిపోవాలనిపిస్తుంది. ఉన్న పొలం ఎండిపోతే ఏం తినాలె? అప్పులేం కట్టాలె? ఈ కారు రైతుబంధు ఇప్పటిదాకా రాలె. కేసీఆర్ వానకాలం ఇస్తే దాన్ని దున్నినోడికి, అంతకుముందు ఇస్తే తోటల గుంటలు తీసినోడికి ఇచ్చిన. ఈసారి రైతుబంధు రాకపోవటంతో అప్పుల పాలైన. మల్లా నువ్వే రావాలి కేసీఆర్ సారు. నా ఓటు నీకే. నీవల్లనే నాకు ఇన్నేండ్లు బుక్కెడు బువ్వ దొరికింది’ అంటూ ఆవేదన చెందాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో త్వరలోనే ముషంపల్లికి వచ్చి మల్లయ్యను కలుస్తానని ట్వీట్ చేశారు. అన్నట్టుగానే సోమవారం మల్లయ్య ఇంటికి వచ్చి పరామర్శించారు. వీడియోను కేసీఆర్ కూడా చూశారని, బాధతో తనను ఇక్కడికి పంపించారని కేటీఆర్ వెల్లడించారు. వీడియోలో అలా ఎందుకు మాట్లాడావని, ఆ ఆలోచన ఎందుకు వచ్చిందని ఆరా తీశారు. తనకున్న తొమ్మిదెకరాల భూమిలో 4 ఎకరాల్లో తోట, ఐదెకరాల్లో పొలం పెట్టానని మల్లయ్య చెప్పాడు. పొలం మొత్తం ఎండిపోయి, పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయానని వివరించాడు. దీంతో ‘నీకేం భయంలేదు. ఇంకా ఏం కావాలన్నా భూపాల్రెడ్డికి చెప్తే నేను వస్తా. నీకు ధైర్యం చెప్పి రమ్మని మమ్మల్ని కేసీఆర్ ఇక్కడికి పంపిండు. నీకు బీఆర్ఎస్ అండగా ఉంటది. ఇక్కడ భూపాల్రెడ్డి, కృష్ణారెడ్డి, జగదీశ్రెడ్డి అండగా ఉంటరు’ అని కేటీఆర్ భరోసా కల్పిస్తూ రూ.లక్ష చెక్కు అందజేశారు. బరువెక్కిన గుండెతో కేటీఆర్కు మల్లయ్య దండం పెట్టాడు. అక్కడే తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నట్టు మహిళలు చెప్పటంతో కాసేపు వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
సీఎం, మంత్రుల స్పందనేది?: కేటీఆర్
‘రాష్ట్రంలో కరువుతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ కరువు కాలం తెచ్చింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని కేటీఆర్ అన్నారు. మల్లయ్య, బోర్ల రాంరెడ్డిని కలిసిన అనంతరం మాట్లాడుతూ.. బోర్ల రాంరెడ్డి కేసీఆర్ హ యాంలో పదేండ్లలో ఒక్క బోరు వేయలేదని, మళ్లీ ఇటీవలే ఆరు బోర్లు వేశారని తెలిపారు. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ కరువు వచ్చిందని ఆరోపించారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలని, రిజర్వాయర్లలో నీళ్లు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడిందని విమర్శించారు. ఇటీవల కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్హౌజ్లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్కి నీళ్లు వదిలారని తెలిపారు. నిన్నటి దాకా కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని, ఇయ్యాల అదే బాహుబలి మోటర్లతో కరీంనగర్కు నీళ్లు అందిస్తున్నరని వెల్లడించారు. ఇదేదో ఎండాకాలం వచ్చేముందు చేసుంటే ఈ కరువు ఉండేది కాదు కదా అని అన్నారు. మం త్రులకు ధైర్యం ఉంటే కరెంటు కోతలు, సాగునీటి కొరత లేదని ఇదే మషంపల్లికి వచ్చి రైతులతో చెప్పాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ ఇచ్చిన లక్షతో అప్పు తీరుస్త
నేను పంట ఎండిపోయిందని బాధ పడితే విలేకర్లు వచ్చి తీసిన వీడియో చూసిన తర్వాత కేటీఆర్ వస్తాడంటే నేను మొదట్లో నమ్మలేదు. కానీ ఇయ్యాల ఆయనే సక్కగ నా ఇంటికి వచ్చి నా మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పిండు. లక్ష రూపాయల చెక్కు ఇచ్చిండు. ఇంకా ఏమైనా బాధ ఉంటే చెప్పు అండగా ఉంటామన్నాడు. నాకు సంతోషం కల్గింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నీళ్ల కష్టాలు లేవని చెప్పిన. ఈ సారి అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే రైతుబంధు రాక అప్పు అట్లే ఉన్నది. ఈ డబ్బుతో అప్పు తీర్చాలి అనుకుంటున్న. తండ్రి లెక్కనే కొడుకు కూడా జనం బాధలు పట్టించుకుంటుండు అంటే గొప్పే గదా.
-గన్నెబోయిన మల్లయ్య, రైతు, ముషంపల్లి
బోర్ల రాంరెడ్డికి భరోసా
వందకుపైగా బోర్లు వేసి బోర్ల రాంరెడ్డిగా పేరు తెచ్చుకున్న రైతు బైరెడ్డి రాంరెడ్డిని కేటీఆర్ కలిసి ధైర్యం చెప్పారు. పంటల పరిస్థితి ఎలా ఉన్నది? ఎన్ని ఎకరాలు ఎండిపోయాయి? అని అడిగి బోర్లు పరిశీలించారు. ఈ కరువుతో నాలుగైదు లక్షల వరకు ఖర్చు చేశానని, అయినా పంటలు ఎండిపోయాయని రాంరెడ్డి తెలిపారు. రాంరెడ్డి కూడా ముషంపల్లి వాసే కావటంతో ఆయన ఇంటికి వెల్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గ్రామ కరువు పరిస్థితిని ఆరా తీశారు. ఎవరూ అధైర్యపడొద్దని, రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేటీఆర్ వెంట సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి, నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ఉన్నారు.