KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): కేసీఆర్పై కోపంతో రైతులపై కక్ష పెంచుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్లో మూడునాలుగు పిల్లర్లకు ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్ చేసి రైతులుకు సాగునీరు అందించాలని కోరారు. రాజకీయం కోసం కేసీఆర్పై కోపం పెంచుకున్నా రైతులపై మాత్రం కక్షగట్టొద్దని హితవు పలికారు. ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయని, మేడిగడ్డ నింపి కాళేశ్వరం పంపింగ్ మొదలుపెట్టాలని కోరారు. బుధవారం కేటీఆర్ శాసనసభలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేశారు.
ఎల్ఎండీ, ఎంఎండీ, సింగూరు, ఎస్సారెస్పీ అన్నీ కాళేశ్వరం పుణ్యమే కాళేశ్వరం ద్వారా కొత్తగా 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, కానీ స్థిరీకరించిన ఆయకట్టు ఎంతని అడిగితే మాత్రం సమాధానం లేదని పేర్కొన్నారు. ఎర్రటి ఎండల్లోనూ అప్పర్ మానేరు, మిడ్మానేరు నీళ్లతో నిండిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు కూడా ఈ విషయం తెలుసని పేర్కొన్నారు. గౌరవెల్లి, మలక్పేట్ రిజర్వాయర్, అప్పర్ మానేరు, స్థిరీకరించబడిన సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ పునరుజ్జీవం అయినా ఇవన్నీ కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇలాంటి వాస్తవాల గురించి ప్రజలకు చెప్పాలని కోరారు.
పొన్నం, నేను కలిసి పనిచేశాం
పొన్నం ప్రభాకర్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ఎంపీగా, తాను ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి 2009 నుంచి కలిసి పని చేశామని పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రిని అవమానించే కుసంస్కారం తనకు లేదని తెలిపారు. కానీ, ఆయన వాస్తవ విరుద్ధ మాటలు చెప్తుంటే తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం నియోజకవర్గం హుస్నాబాద్లో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రన్ అయిన విషయం నిజం కాదా? వేములవాడ నియోజకవర్గంలో మలక్పేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యి అందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మంత్రులు మేడిగడ్డకు వెళ్లి వచ్చి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు దారుణం
కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కేటీఆర్ కోరారు. ఉప ముఖ్యమంత్రిగా, పదిహేనేండ్ల పాటు మంత్రిగా పనిచేసిన సీనియర్ దళిత రాజకీయ నాయకుడిపై ఆలాంటి వ్యాఖ్యలు దారుణమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం అంటే ఒక్కటే బరాజ్ కాదు
కాళేశ్వరం అంటే ఒకటే బరాజ్ కాదని, కాళేశ్వరం అంటే మూడు బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 240 టీఎంసీల యుటిలైజేషన్ అని కేటీఆర్ వివరించారు.
సభ్యులందరినీ ఒకేలా చూడాలి
ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తమకు 39 మంది సభ్యులంటే అధికారపక్షంలో 64 మంది సభ్యులున్నారని కేటీఆర్ తెలిపారు. స్పీకర్ మాత్రం అధికార పక్షంలో ఎవరు లేచినా సమయం ఇస్తున్నారని, అధికారపక్ష సభ్యులు తమను వ్యక్తిగతంగా దూషించినా, నోటికొచ్చినట్టు మాట్లాడినా తమ వాదన వినిపించేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలోని 119 మంది సభ్యులకు సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. అధికారపక్ష సభ్యులు ఎప్పుడు అడిగినా, ఎంతసేపు అడిగినా మైక్ ఇస్తూ ప్రోత్సహించడం సరికాదని పేర్కొన్నారు. సభ్యులందరినీ ఒకేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.