KTR | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా ? గల్లీలో రైతుల కన్నీళ్లు పట్టవా ? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రైతులంటే చిన్నచూపు ఎందుకని, పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంటనష్టంపై లేదెందుకని ఆయన బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎంను నిలదీశారు.
‘నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడలేదు. అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా..?’ అని నిప్పులు చెరిగారు. ‘ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?’ అని ధ్వజమెత్తారు. ‘సీట్లు ఓట్ల పంచాయితీయే తప్ప.. అన్నదాతల ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా ? ’ అని మండిపడ్డారు.
ప్రజాపాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా? దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా ? అని ప్రశ్నించారు. హైకమాండ్ చుట్టూ చకర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా..సాగునీరు ఇవ్వడం చేతకాలేదని, ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నా మనసు రావడం లేదా ? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.