సూర్యాపేట, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి (G. Ramachandra reddy) 95ఏండ్ల వయసులో సర్పంచుగా గెలిచి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే సొంతూరు సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తిగా రామచంద్రారెడ్డి బరిలో ఉండడం ద్వారా రాష్ట్రంలోనే సెన్సేషన్గా నిలవగా.. ఆయన గెలవడం రాజకీయ చరిత్రలోనే సంచలనాత్మకమైన సరికొత్త రికార్డు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో గెలువకుండా నిలువరించాలని సర్వశక్తులు ఒడ్డినా కాంగ్రెస్కు పరాభవమే దక్కింది. కాంగ్రెస్ పార్టీ జగదీశ్రెడ్డి తండ్రి పోటీ చేస్తున్న నాగారం సర్పంచ్ ఎన్నికలను చాలెంజ్గా తీసుకున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి జగదీశ్రెడ్డి తండ్రిని ఓడించేందుకు గ్రామంలో దాదాపు మూడు కోట్లకు పైనే ఖర్చు చేశారని గ్రామస్తుల అంచనా. ఇంత జరుగుతున్నా జగదీశ్రెడ్డి మాత్రం కూల్గా ఉంటూ గ్రామానికి తన తండ్రి ఎనిమిది దశాబ్దాలుగా చేసిన సేవలు, చేపట్టిన పనులకుతోడు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తమ కుటుంబంపై సానుభూతి ఉంటుందని నమ్మారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురు గాలి వీచినా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన జగదీశ్రెడ్డి ఎన్నికల కోసం గ్రామానికి వెళ్లకుండా కేవలం వ్యూహం రూపొందించి అమలు చేయించడంతోపాటు ఓ సర్పంచ్ అభ్యర్థి ఖర్చు చేయాల్సిన పరిమితిని కూడా దాటకుండా తండ్రిని గెలిపించుకొని సత్తాచాటారు.
95 ఏండ్ల వయసులో గ్రామ సర్పంచ్గా పోటీ చేసి, విజయం సాధించిన జీ రామచంద్రారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. ప్రజాసేవ చేసేందుకు వయసు అడ్డురాదని నిరూపించారంటూ కొనియాడారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జగదీశ్రెడ్డి గురువారం కేసీఆర్కు తెలియజేశారు. 95 ఏండ్లుపైబడిన రామచంద్రారెడ్డి ఎన్నికల్లో యువకులతో పోటీపడటం, గెలుపొందడంపై కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
వెంటనే రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి అభినందించారు. అద్భుతమైన విజయం సాధించారని, మీ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. గ్రామ పాలనలో మీ అనుభవంతో మంచి ముద్ర వేయాలని, దేశానికి నాగారం ఒక మాడల్గా నిలువాలని ఆకాంక్షించారు. 95 ఏండ్ల వయసులో నేటి యువతతో పోటీపడి ప్రజాసేవకు ముందుకు రావడం, ప్రజల ఆదరణ పొంది గెలవడం ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఈ సం దర్భంగా కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలషించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి కేసీఆర్తో మాట్లాడుతూ.. సీఎంగా మళ్లీ మీరే రావాలని, మరోసారి తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
కేటీఆర్ అభినందనలు
రామచంద్రారెడ్డికి కేటీఆర్ కూడా ఫోన్ చేసి అభినందించారు. సుదీర్ఘ జీవిత అనుభవాన్ని రంగరించి, నాగారం గ్రామ అభివృద్ధిలో ముం దుండాలని ఆకాంక్షించారు. నాగారం గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయం అందించడానికి తాను సిద్ధమని, రామచంద్రారెడ్డి గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తారన్న నమ్మకం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.