హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకనైనా అహంకారం మానుకోవాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి హితవు పలికారు. ఇటీవల ఆయన చర్యలు హేయంగా ఉ న్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ ర్యాంకు కలిగిన జడ్పీచైర్మన్పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అవిశ్వాసాలకు ఉసిగొల్పే ఆటవిక చర్యలు ఇకనైనా మానుకోవాలని సూచించారు.
నియోజవర్గాల అభివృద్ధి కోసం కొందరు సీఎంను కలువటంలో తప్పేమి లేదన్నారు. కొందరు పార్టీలు మారుతున్నారని వచ్చేవన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతు పాతిపెడతామని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలెక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవాచేశారు. చెట్లు, కొమ్మలు కొట్టేసే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు కోతలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తామెంత మోసపోయామో ప్రజలకు అవగాహన వచ్చిందని చెప్పారు. వేసవిలో విద్యుత్తు కోతలు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చని అన్నారు.