బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ విలీనానికి సంబంధించి ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉచిత బస్సు స్కీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు.. ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగింది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకొని అయినా వెంటనే ‘అపాయింటెడ్ డే’ని ప్రకటించి, విలీన జీవో విడుదల చేయాలి.
-హరీశ్రావు
Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ అపాయింటెడ్ డేను వెంటనే ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అపాయింటెడ్ డే ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలైనా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వమే బిల్లు ఆమోదింపజేసిందని.. ప్రభుత్వం, కార్మికుల ఒత్తిడితో గవర్నర్ కూడా బిల్లుకు ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం సీఎంకు హరీశ్రావు లేఖ రాశారు.
కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్ మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో పాటు, ఆర్టీసీ కార్మికులతో కలిసి తెచ్చిన ఒత్తిడి ఫలితంగా గవర్నర్ బిల్లును ఆమోదించిన విషయం కూడా విదితమే. శాసనసభ, గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ మాత్రమే మిగిలి ఉన్నది. ఎన్నికల కోడ్ రావడంతో మా ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేకపోయింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ‘అపాయింటెడ్ డే’ అమలు చేస్తామని బీఆర్ఎస్ నాడు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని, కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని మీ దృష్టికి తెస్తున్నాను.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటినా ఇంతవరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. వాస్తవంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే, ఆర్టీసీ విలీన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ నేటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు.. ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగింది.
బస్సుల్లో ఎకువ మంది మహిళలు ఉండటంతో ఓవర్లోడ్ బస్సులు నడపలేక డ్రైవర్లు, కికిరిసిన బస్సుల్లో కలియతిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తున్నది. డ్రైవర్లు ఎకువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకుని అయినా వెంటనే ‘అపాయింటెడ్ డే’ని ప్రకటించి, విలీన జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని కోరుతున్నాను.
బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యి డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి తెప్పించింది. వాటిని కూడా మీరే ఇటీవల ప్రారంభించారు. పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరుతున్నాను. 2013లో జారీచేసిన పీఆర్సీ బాండ్స్కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మీరు చెప్పిన విదంగానే బాండ్స్కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని కోరుతున్నాను. అదనపు బస్సులు సమకూర్చే విషయంలో, పీఆర్సీ బాండ్స్ చెల్లించే విషయంలో మీరే స్వయంగా చొరవ చూపగలరని మనవి అని మాజీ మంత్రి హరీశ్రావు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.