అప్పులు తెచ్చి బిల్డింగులు కట్టామని చెబుతున్నారు. వరంగల్ నగరం మధ్యలో ఉన్న నిజాం నవాబుల కాలంనాటి పురాతనమైన సెంట్రల్ జైలు కూలగొట్టి దవాఖాన కట్టారు. ఇది సరికాదు. దవాఖాన సిటీ మధ్యలో కంటే ఊరి చివరి ఉంటేనే బాగుండేది. సచివాలయ పాత భవనాన్ని కూలగొట్టి మళ్లీ అక్కడే ఎందుకు కట్టారు. ఇంకెక్కడైనా అయితే బాగుండేది.
-కొండా సురేఖ, మంత్రి
Minister Konda Surekha | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అటవీశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ జైలు సిటీ మధ్యలోనే ఉండాలని, దవాఖానను ఊరి బయటే ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చి బిల్డింగులు కట్టామని చెబుతున్నారని, వరంగల్ నగరం మధ్యలో ఉన్న సెంట్రల్ జైలు కూలగొట్టి దవాఖాన కట్టారని, ఇది సరికాదని పేర్కొన్నారు.
దవాఖాన సిటీ మధ్యలో కంటే ఊరి చివరి ఉంటేనే బాగుండేదని పేర్కొన్నారు. సచివాలయ పాత భవనాన్ని కూలగొట్టి మళ్లీ అక్కడే ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ఇంకెక్కడైనా అయితే బాగుండేది కదా అని అభిప్రాయపడ్డారు. గతంలో కేసీఆర్ కుటుంబం, ఏపీ సీఎం జగన్ కుటుంబాలు రెండు కలిసి భోజనాలు చేశాయని, కానీ ఆ సమావేశంలో సీఎస్లు ఎందుకు ఉండరని నిలదీశారు.
కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని, మోదీతో మనకు పంచాయితీ ఎందుకు? కలిసి ఉండొచ్చు కదా అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో ఆసక్తి కలిగించాయి. సురేఖ వ్యాఖ్యలకు హరీశ్రావు అంతే ఘాటుగా స్పందించారు. “దవాఖాన ఊరవతల ఉండాలట, జైలేమో ఊర్లో ఉండాలట, ఇదేంది అధ్యక్ష్యా? ప్రజలు ఇబ్బందులు పడొద్దని వరంగల్ నడిబొడ్డున దవాఖాన ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించాం” అని పేర్కొన్నారు.