హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తరతరాలుగా ఉత్పత్తి, శ్రమలో పాల్గొంటూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న బీసీలు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మార్చి 1 నుంచి మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం మిరిగోన్పల్లి వీరయోధుడు పండుగ సాయన్న జన్మస్థలం నుంచి నిర్వహించతలపెట్టిన బీసీ మహా పాదయాత్రకు హాజరుకావాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్రావును ఆలిండియా ఓబీసీ జేఏసీ బృందం ఆహ్వానించింది. ఈ సందర్భంగా జేఏసీ బృందంతో హరీశ్రావు మాట్లాడారు.
కుల జనగణన, మహిళా బిల్లులో బీసీ కోటా, రిజర్వేషన్లపై 50 శాతం వాటా ఎత్తివేతతోపాటు చట్టసభల్లో బీసీ వాటా కోసం ఆలిండియా ఓబీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీసీ సబ్బండ వర్గాల పాత్ర కీలకమైనదని, అదే స్ఫూర్తితో బీసీ వాటా సాధన ఉద్యమం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హరీశ్రావును కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఏటిగడ్డ అరుణ, ఆలిండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్ వెలుగు వనిత, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.