ఐనవోలు (హనుమకొండ) : కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమ కొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు మెంబర్లు చింత అశోక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బరిగెల ఇసాక్, మాజీ సొసైటీ డైరెక్టర్ మొలుగూరి బాబు, కొత్తూరు జాన్సన్, చింత రఘులతో పాటు పలువురు కార్యకర్తలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన వారంతా కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుంది. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ పంపుల మోహన్, మండల ఇంచార్జ్ పోలేపల్లి రామ్మూర్తి, మాజీ సర్పంచులు పల్లగొండ సురేష్, ఎస్.కె ఉస్మాన్ అలీ, సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.