దేవరుప్పుల, మార్చి 11 : రిజర్వాయర్లలో నీళ్లుండి ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా, ధర్మగడ్డ తండా, సీతారాంపురం, ధర్మాపురం, పాలకుర్తి మండలం మైలారం టీకేనాయక్ తండా, మల్లంపెల్లి బీకేనాయక్పెద్ద తండాలో ఎండిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో గుంట మడి ఎండకుండా పదేండ్లు నీళ్లిచ్చామని, ఇప్పుడేమొచ్చిందని ప్రశ్నించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా అవగాహన లేని మంత్రులు, సమన్వయంలేని అధికారగణం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని అన్నారు. కరువును ఎదుర్కొనేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. రివర్స్ పంపింగ్తో సగం తెలంగాణ సుభిక్షం చేసే వీలుంటుందని తెలిపారు. ఇంత మంచి ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులతో రాజకీయలొద్దని.. ఇకనైనా నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలని కోరారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలకు నిరసనగా 12వ తేదీన మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దయాకర్రావు చెప్పారు.