మంచిర్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్లో హస్తం పార్టీ ఖాళీ అయింది. టికెట్ ఆశించిన వారికి పార్టీ రిక్తహస్తం చూపించడంతో నేతలు పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. నేతల రాజీనామాలతో ఒక్క రోజులోనే ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఖాళీ అయింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ మంత్రి రాంచందర్రెడ్డి మేనల్లుడు సంజీవ్రెడ్డి సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ కంటతడి పెట్టుకున్నారు. నమ్ముకున్న కాంగ్రెస్ తనకు తీరని అన్యా యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకుండా పోయిందని ఉద్వేగానికి గురయ్యారు. ఆరెస్సెస్ భావజాలం ఉండి, బీజేపీ నుంచి వచ్చిన కంది శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్యారాచూట్ నాయకులకు కాకుండా తమ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేసి ఉండేవాళ్లమని చెప్పారు. కాంగ్రెస్ రెబల్గా సంజీవ్రెడ్డి బరిలో ఉంటారని, పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా ముథోల్ టికెట్ను ఆశించిన కిరణ్ కొమ్రేవార్ కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. తనకే టికెట్ ఇస్తామని రేవంత్ చెప్పారని, ఇప్పుడేమో అసలు దరఖాస్తే చేసుకోని నారాయణరావు పటేల్కు టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. అన్యాయం చేసిన పార్టీలో ఉండలేకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్లోని తాజా పరిణామాలు పార్టీశ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. బోడ జనార్దన్ బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించగా, డాక్టర్ రాజారమేశ్ కూడా కారెక్కబోతున్నట్టు తెలిపారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్ను గడ్డం వివేక్కు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు భగ్గుమన్నారు. వివేక్కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం డాక్టర్ రాజారమేశ్ పార్టీకి రాజీనామా చేసి కలకలం రేపారు. కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి బోడ జనార్దన్ సోమవారం ప్రకటించారు. పార్టీలో కనీసం మూడేళ్లుగా ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన వివేక్కు టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే రాజీనామా చేశానని, వివేక్ను ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.