షాద్నగర్, ఫిబ్రవరి 20 ః అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అధ్యక్షతన షాద్నగర్ పట్టణంలోని కుంట్లరాంరెడ్డి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా రైతు బంధు, రైతు రుణమాఫీ, 4 వేల పింఛన్ల ఊసే లేదన్నారు. 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి గొప్పలకు పోతుందని మండిపడ్డారు. కరోనా కాలంలోనూ కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు నిధులు ఆపలేదన్నారు. ఏనాడూ జై తెలంగాణ అనని వ్యక్తి, ప్రస్తుతం సీఎం కావడం బాధాకరమన్నారు. బూతులు మాట్లాడుతూ వ్యంగ్య ప్రసంగాలు చేస్తూ కాలయాపన చేయడం తప్ప ప్రజలపై ప్రేమ లేదని మండిపడ్డారు. పాలమూరు ప్రాంతాన్ని కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయని దుయ్యబట్టారు.
పాలమూరు ప్రాజెక్టు పనులను 80 శాతం మేర బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండలో నిర్వహించిన కృష్ణా జలాల సభతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి అసెంబ్లీలో ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేశారని, ఆ స్ఫూర్తితోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామనే విషయాన్ని మర్చిపోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు, ఓటములు సహజమని, ఎన్నడూ అధికారం కోసం పని చేయలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వై.ఎస్ రాజశేఖర్రెడ్డిలు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసినా వెనుకడుగు వేయలేదన్నారు. ఎవ్వరికి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని, ఒక్క ఫోన్తో గంట సమయంలో షాద్నగర్లో ఉంటానని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
తెలంగాణ పోరులో షాద్నగర్ ప్రాంత ప్రజల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై గ్రామీణ స్థాయిలో ఎక్కడిక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఇప్పటి నుంచే బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, నేడు కాంగ్రెస్ చేస్తున్న పాలన తీరును పోల్చుతూ ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశ మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం ఇవ్వలేదని, మన తెలంగాణ రాష్ట్రంలో మన టీవీ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించడమే కాకుండా ఆయనకు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని, అసెంబ్లీ తీర్మాన ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం పీవీ నర్సింహారావుకు భారత రత్న ఇవ్వడం సంతోషకరమన్నారు. తెలంగాణ ఉద్యమంతో సిరిపురం యాదయ్య పాత్ర వెలకట్టలేనిదని, ఆ నాడు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలంగాణ కోసం అమరడయ్యారని గుర్తు చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమావేశానికి ముందు కళాకారుడు సాయిచంద్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. హరీశ్రావును పార్టీ నాయకులతో పాటు పలువురు సన్మానించారు.
ఈ సమావేశంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, ఎంపీపీ వై. రవీందర్యాదవ్, నాయకులు ఎస్డీ ఇబ్రహీం, ఇంతీయాజ్, వెంకటేశ్వర్రెడ్డి, రజినీసాయిచంద్, రాజావరప్రసాద్, రాజ్యలక్ష్మి, రాంబాల్నాయక్, రాములు, రాజేశ్పటేల్, మిట్టునాయక్, వంకాయల నారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, లక్ష్మీనర్సింహారెడ్డి, లక్ష్మణ్నాయక్, బుచ్చిగూడ వెంకట్రెడ్డి, అగ్గనూరు విశ్వం, వన్నాడ ప్రకాశ్గౌడ్, శ్రీధర్రెడ్డి, ఒగ్గు కిషోర్, దేవేందర్యాదవ్, యుగేందర్, ప్రతాప్రెడ్డి, శంకర్, రంగయ్య, ఆంజనేయులు, ఈశ్వర్రాజు, ఎజాజ్ అడ్డు, బాబాఘోరీ, మర్రిపల్లి నర్సింహ, యాదయ్య, నక్కల వెంకటేశ్గౌడ్, బక్కన్నయాదవ్, నర్సింగరావు, డొలీ రవీందర్, సత్యనారాయణ, శేఖర్ పాల్గొన్నారు.
సమైక్య రాష్ట్రంలో డీజిల్తో పరిశ్రమలు నడిచాయి ;మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి
సమైఖ్య రాష్ట్రంలో డీజిల్ పోసి జనరేటర్లతో పరిశ్రమలను నడిపారు. కేసీఆర్ ప్రభుత్వంలోని నిరంతర కరెంట్తో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది. ప్రస్తుత ప్రభుత్వం రైతులను విస్మరిస్తున్నది.
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి..; మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుండే.. కేసీఆర్ పాలనలో రైతులు ఎలా అభివృద్ధి చెందారో మనం చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా రైతు బంధు, రైతు రుణమాఫీ, పింఛన్లు లేవు.
ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటాలి..; ఎమ్మెల్సీ వాణీదేవి
రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులమంతా కలిసికట్టుగా పని చేసి సత్తాను చాటుదాం. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను జరిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్.
బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉన్నది..; మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకున్నది. అబద్దాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి.
కాంగ్రెస్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు.. ; మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
సాగు, తాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు. అర్థరహిత ఆరోపణలు చేస్తున్నది. అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసం చేయడం సరికాదు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు.